హైదరాబాద్లో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఓ కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచింది. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఆ కుటుంబంలో తండ్రీ కొడుకులిద్దరినీ కరోనా బలితీసుకుంది. మలక్పేట గంజ్లో నూనె వ్యాపారం చేసే వ్యక్తి అస్వస్థతకు గురై వనస్థలిపురంలోని ఓ దవాఖానలో ఇటీవల చికిత్స పొందగా కరోనా అని తేలింది. అతని ద్వారా వనస్థలిపురం ఏ–క్వార్టర్స్లో నివాసం ఉండే తండ్రి (76), తమ్ముడు (45), ఇతర కుటుంబ సభ్యులకు కరోనా సోకింది.
అయితే.. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం నాడు తండ్రి మృతిచెందగా, శుక్రవారం నాడు కుమారుడు (గంజ్ వ్యాపారి తమ్ముడు) కూడా మృతి చెందాడు. ఈఘటనతో స్థానికంగా తీవ్రవిషాద ఛాయలు అలుముకున్నాయి. వీరి కుంటుంబానికి చెందిన మరో నలుగురు కూడా ప్రస్తుతం గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు గంజ్ వ్యాపారి, అతని భార్య, కుమారునికి కూడా కరోనా పాజిటివ్ అని తేలడం, అలాగే బీఎన్రెడ్డినగర్ ఎస్కేడీనగర్లో నివాసం ఉండే మరో కుటుబంలోని ఇద్దరికి పాజిటివ్ రావడంతో మూడు కుటుంబాలకు చెందిన బంధువులందరూ గాంధీ దవాఖానలోనే చికిత్స పొందుతున్నారు.