ఢిల్లీలో తెలుగు మీడియా జర్నలిస్టుకు కరోనా సోకింది. ఇక్కడి అపోలో ఆస్పత్రిలో శుక్రవారం పరీక్ష జరపగా.. శనివారం ఉదయానికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. సహచర తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ప్రతినిధులు వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఢిల్లీ ప్రతినిధులతో మాట్లాడారు. మీడియా అకాడమీ నుంచి బాధితుడి చికిత్సకు, కుటుంబ అవసరాల నిమిత్తం రూ.20 వేలు డిపాజిట్ చేయనున్నట్టు తెలిపారు. తోటి జర్నలిస్టులు క్వారంటైన్కు వెళ్లాల్సి వస్తే రూ.10 వేలు డిపాజిట్ చేస్తామని భరోసా ఇచ్చారు.
టీవీ చానల్ యాజమాన్యం తక్షణ సాయంగా రూ.లక్ష ఆస్పత్రిలో జమ చేసింది. అపోలో ఆస్పత్రి యాజమాన్యంతో డాక్టర్లతో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి మాట్లాడి మీడియా ప్రతినిధి క్షేమంపై ఆరా తీశారు. ఉప రాష్ట్రపతి జర్నలిస్టు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి భరోసా ఇచ్చారు. కాగా, జర్నలిస్టుల అభ్యర్థన మేరకు ఢిల్లీ తెలుగు మీడియా ప్రతినిధులందరికీ కోవిడ్ టెస్ట్ చేయించేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.