ఏపీలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ అధికమవుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో 6534 శాంపిల్స్కు పరీక్షలు చేయగా 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ను ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1583కు చేరుకుంది. మరణాల సంఖ్య 33కు చేరుకుంది. ఇక ప్రస్తుతం 1062 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 488 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్లడించారు.
ఇక కర్నూలు జిల్లాలో మాత్రం కేసుల సంఖ్య ఏమాత్రమూ తగ్గడం లేదు. ఈ రోజు కొత్తగా 30 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 466కు చేరుకుందని అధికారులు తెలిపారు. అలాగే గుంటూరు కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈరోజు కొత్తగా 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 319కి చేరుకుందని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత కృష్ణా జిల్లాలోనూ కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటివరకు జిల్లాలో 266 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.