అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నమ్మిందే నిజమైంది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను కొట్టిపారేస్తూ.. ఆయన క్షేమంగా ఉన్నారని, తనకు తెలుసునని ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు 20రోజుల తర్వాత కిమ్ కనిపించి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చాడు. ఇక కిమ్ తిరిగి ప్రజల ముందుకు రావడం పట్ల అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. కిమ్ ఆరోగ్యంగా తిరిగి రావడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘కిమ్ ఆరోగ్యంగా తిరిగొచ్చారు. సంతోషంగా ఉంది’ అని ట్రంప్ పేర్కొన్నారు.
కాగా, మూడు వారాలుగా పత్తాలేకుండా పోయిన కిమ్ జోంగ్ ఉన్ మేడే రోజున ప్రజలముందుకొచ్చారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోని సన్చిన్లో ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నట్టు ఆ దేశ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఇక న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన వీడియోలో ఆయన ఎక్కడా అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించకపోవడం గమనార్హం. ఆ కార్యక్రమం ఫొటోలు, వీడియో వైరల్ అయ్యాయి.
I, for one, am glad to see he is back, and well! https://t.co/mIWVeRMnOJ
— Donald J. trump (@realDonaldTrump) May 2, 2020