కరోనా వైరస్కు త్వరలోనే మూకుతాడు పడుతుందని నీతి ఆయోగ్ సభ్యులు వీకే పాల్ అన్నారు. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుదలలో కొద్ది రోజుల్లోనే నిలకడ రావచ్చని పాల్ పేర్కొన్నారు. తొలి, రెండు దశల్లో ఇచ్చిన సడలింపుల ఫలితాలను కొనసాగించేందుకే ప్రభుత్వం మరో రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగింపునకు మొగ్గుచూపిందని అన్నారు.
వైరస్ చైన్ను నిలువరించడమే లాక్డౌన్ ఉద్దేశమని, మధ్యలోనే లాక్డౌన్ను విరమిస్తే ఆ ఉద్దేశం నీరుగారుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో వైరస్ ఉనికి లేని ప్రాంతాల్లో అత్యంత జాగరూకతతో సడలింపులు ప్రకటించాలని, కరోనా కట్టడికి సంబంధించి వైద్య పరికరాలు, నిర్వహణ ప్రణాళికా సాధికార గ్రూపునకు నేతృత్వం వహిస్తున్న పాల్ పేర్కొన్నారు.
లాక్డౌన్కు ముందు కరోనా కేసుల తీవ్రతతో పోలిస్తే ఇప్పుడు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల పెద్దగా లేదని చెప్పుకొచ్చారు. వైరస్ వ్యాప్తి మొత్తంగా తగ్గిందని, అయితే కేసుల సంఖ్యలో ఇంకా నిలకడ రాలేదని, ఇది ఎప్పటికైనా కుదురుకుంటుందని చెప్పారు.