తెలంగాణలో మళ్లీ కరోనా వైరస్ ప్రభావం తీవ్రమవుతోంది. గత రెండు రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. శనివారం 17 కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం నాడు మరో 21 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 20, జగిత్యాలలో 1 కేసు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1082కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 508గా ఉంది. ఆదివారం ఒక్కరోజే 46 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు మొత్తం 545 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్లో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న నమోదు అయిన మొత్తం 17 కేసులలో 15 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు అయ్యాయి. ఈ రోజు కూడా మొత్తం 21 కేసులు నమోదు కాగా.. 20 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వనస్థలిపురం పరిధిలో కొత్తగా 8 కంటైన్మెంట్ జోన్లను అధికారులు గుర్తించారు. ఈ జోన్లలో వారం రోజుల పాటు రాకపోకలను బంద్ చేస్తున్నారు అధికారులు.