నేటి నుంచి దేశవ్యాప్తంగా మూడో దశ లాక్ డౌన్ ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసి ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏయే రంగాలకు సడలింపులు ఇవ్వాలి..? కరోనా కట్టడికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? అన్న అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా లాక్డౌన్ సడలింపులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి.. కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్ను కంటైన్మెంట్ క్లస్టర్ల ప్రాతిపదికగా సోమవారం నుంచి కొన్ని రకాల సడలింపులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారమే ఉత్తర్వులు జారీచేసింది.
కేంద్ర హోంశాఖ ఆదేశాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించింది. కంటైన్మెంట్ క్లస్టర్లలో కరోనా నివారణ చర్యలను మరింత పటిష్టం చేయాలని కూడా ఈ ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, ఇప్పటివరకు ప్రభుత్వం 246 క్లస్టర్లను గుర్తించింది. అయితే.. ఈ రోజు నిర్వహించనున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో చర్చించి మరికొన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.