లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకున్న వలసకూలీలను ప్రత్యేక శ్రామిక్ రైళ్లలో స్వంత స్థలాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే. అయితే వారి వద్ద రైల్వే టికెట్ వసూల్ చేస్తున్నారు అధికారులు. ఇలా డబ్బులు వసూలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. వలస కూలీల టికెట్ల ఖర్చును తామే భరిస్తామని అన్నారు. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు అన్ని చర్యలు తీసుకుంటాయని ఆమె తెలిపారు. వలస కూలీల సేవలో ఇదో చిన్న సాయంగా భావిస్తామని ఆమె పేర్కొన్నారు. విపత్కర సమయంలో వారికి సంఘీభావంగా నిలవనున్నట్లు సోనియా తెలిపారు. ఎలాంటి ముందస్తు సమచారం లేకుండానే లాక్డౌన్ విధించారని, కేవలం కేవలం నాలుగు గంటల సమయం మాత్రమే ఇచ్చారని, దీంతో వలస కూలీలు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారని సోనియాగాంధీ ఆరోపించారు.
ఇంతటి కష్టకాలంలో కూలీల నుంచి టికెట్ చార్జీలు వసూల్ చేయడం దారుణమని సోనియా తప్పుబట్టారు. కూలీలను సురక్షితంగా స్వంత ప్రాంతాల్లో వదలడం ప్రభుత్వ బాధ్యత అని ఆమె గుర్తు చేశారు. ఇప్పటికీ లక్షలాది మంది వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు ఆమె ఆరోపించారు. అహ్మదాబాద్లో జరిగిన నమస్తే ట్రంప్ ఈవెంట్కు జనాలను తీసుకువచ్చేందుకు వంద కోట్లు ఖర్చు చేశారని, పీఎం రిలీఫ్ ఫండ్కు రైల్వే శాఖ 151 కోట్లు ఇచ్చిందని, కానీ కూలీలను తరిలించేందుకు వారి నుంచి టికెట్ ఛార్జీ వసూల్ చేయడం హేయంగా ఉందని సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.