ఏపీపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో ప్రతిరోజూ 50కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 67 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 1650కు చేరింది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వం గత 24 గంటల్లో 10,292 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 67 మందికి వైరస్ నిర్ధారణ అయింది. 
 
తాజాగా నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 25 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 491కు చేరింది. గుంటూరులో 19 కేసులు నమోదు కాగా కృష్ణా జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా పెద్దగా కేసులు నమోదు కాని విశాఖ జిల్లాలో ఒక్కరోజే 6 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలలో కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు. 
 
మరోవైపు ప్రతిరోజూ అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తూ ఉండటంతో మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో కరోనా పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: