ఉగ్రవాదులు మళ్లీ తెగబడ్డారు.. నిన్న జమ్ముకశ్మీర్లోని కుశ్వారా జిల్లా హంద్వారా సెక్టార్లో ఉగ్రవాదులు దాడి చేసి కల్నల్ అశుతోష్ శర్మ సహా ఐదుగురు జవాన్లను కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి తేరుకోక ముందే మళ్లీ ఉగ్రమూక రెచ్చిపోయింది. అదే హంద్వారా సెక్టార్లో మరోసారి దాడులకు దిగింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమవగా ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో ఏడుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, గాయపడ్డ జవాన్లను ఆస్పత్రులకు తరలించామని, ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు.
ఓ వైపు దేశం మొత్తం కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుంటే.. ఇదే అదనుగా ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. భారత్ను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయి. నిజానికి.. పాక్ ఆక్రమిత కశ్మీర్లో సుమారు 300మంది ఉగ్రవాదులు ఉన్నారని కొద్దిరోజుల ముందే ఇంటెలీజెన్స్ వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. నిన్ని జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను కూడా మన జవాన్లు అంతం చేశారు.