ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు జనం నాడి తెలుసుకుని.. వారి ఆకాంక్షకు అనుగుణంగా అడుగులు వేస్తారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తాజాగా.. తెలంగాణలో మే 7వ తేదీ తర్వాత కూడా లాక్డౌన్ పొడిగించేందుకు సీఎం కేసీఆర్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఓ ప్రముఖ చానెల్ నిర్వహించిన సర్వేలో.. మరో రెండు వారాలపాటు లాక్డౌన్ పొడిగించడమే మంచిదన్న అభిప్రాయాన్ని తెలంగాణ ప్రజలు వ్యక్తం చేశారట. అంతేగాకుండా.. కరోనా వైరస్ను పకడ్బందీగా ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నారని తెలంగాణ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారట. ఈ సర్వేలో తెలంగాణలో లాక్డౌన్ కొనసాగించాలని అత్యధికంగా 76శాతం మంది కోరడం గమనార్హం.
లాక్డౌన్ వద్దని 24శాతం మంది ప్రజలు చెప్పారట. మరోవైపు హైదరాబాద్లో లాక్డౌన్ పొడిగింపునకు 86శాతం మంది ఓటేశారట. లాక్డౌన్ పొడిగింపు వద్దని కేవలం 14శాతం మంది మాత్రమే తెలిపారట. ఈ నేపథ్యంలో ప్రజలు అభిప్రాయానికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్ను మరో రెండువారాలపాటు పొడిగిస్తారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. ఈ నెల 5న నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.