తమిళనాడులో కరోనా వైరస్ ప్రభావం తీవ్రమవుతోంది. రాజధాని చెన్నెలోని కోయంబేడు మార్కెట్ కరోనా హాట్స్పాట్గా మారి రాష్ర్టాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిజానికి.. కోయంబేడు మార్కెట్ దేశంలోనే అతిపెద్ద కూరగాయలు, పండ్లు, పూల హోల్సేల్ మార్కెట్. 295 ఎకరాల్లో విస్తరించిన ఈ మార్కెట్లో మూడు వేలకుపైగా దుకాణాలున్నాయి. నిత్యం వేల సంఖ్యలో వ్యాపారులు ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ఇక ఈ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. సోమవారం రాష్ట్రంలో కొత్తగా 527 కరోనా కేసులు నమోదుకాగా అందులో ఎక్కువ శాతం కేసులు ఈ ప్రాంతానికి చెందినవే.
వేల సంఖ్యలోజనం రావడం వల్ల వైరస్ మరింత మందికి సోకవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 3,550ని దాటగా మరణాల సంఖ్య 31గా ఉన్నది. ఒక్క చెన్నైలోనే మొత్తం 1,724 కేసులు, 18 మరణాలు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా.. సడలింపుల నేపథ్యంలో గ్రీన్, ఆరంజ్ జోన్లలో నిర్మాణ, కంప్యూటర్ దుకాణాల్లో వ్యాపారాలు మొదలయ్యాయి. అయితే మద్యం అమ్మకాలను పునరుద్ధరించలేదు. దీంతో తమిళులు నిన్న మద్యం కోసం ఏపీకి తరలివెళ్లడం గమనార్హం.