ఏపీలో మందుబాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపతి ఉత్తర్వలు వచ్చేవరకూ మద్యం అమ్మకాలను నిలిపివేయాలని ఎక్సైజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం షాపుల వద్ద రద్దీని, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం టోకెన్ పద్ధతిని తీసుకొచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో 50 నుంచి 70శాతం వరకు మద్యం ధరలు పెంచారనే విషయాన్ని కూడా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అన్ని అంశాలను పరిశీలించి, మళ్లీ ఆదేశాలు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ సడలింపుల మేరకు నిన్న ఏపీలో మద్యం షాపులను తెరిచింది జగన్ సర్కార్. ఇలా షాపులను తెరిచారో లేదో.. అలా వందలు, వేల మంది మందుబాబులు షాపుల ముందు వాలిపోయారు. గుంపులు గుంపులుగా షాపుల ముందు కిలోమీరట్ల కొద్దీ బారులు తీరారు. ఓవైపు కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతుండగా.. ఇలా మద్యం షాపులను తెరవడం ఏమిటంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలికంగా మద్యం అమ్మకాలను నిలిపివేస్తూ ఈరోజు నిర్ణయం తీసుకుంది.