ఢిల్లీ ప్రభుత్వం మందుబాబులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు మనం ఇంటి పన్నులు, నల్లా పన్ను తదితరు పన్నుల గురించి విన్నాం..చెల్లించాం. కానీ.. ఢిల్లీ ప్రభుత్వం తాజాగా.. మద్యానికి కరోనా ట్యాక్స్ విధించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ నిబంధనల మేరకు నిన్నటి నుంచి ఢిల్లీలో మద్యం షాపులను తెరుస్తున్నారు. షాపులను ఇలా తెరిచారో లేదో.. మందుబాబులు వందలు వేల సంఖ్యలో బారులుతీరారు. దీంతో రద్దీని అదుపుచేయలేక పలు షాపులను వెంటనే మూసివేశారు కొందరు యజమానులు. సామాజిక దూరం పాటించకుండా మందుబాబులు షాపులపైకి ఎగబడ్డారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం ధరలను భారీగా పెంచింది. ‘స్పెషల్ కరోనా ఫీజు’ పేరుతో మద్యం ధరలను 70 శాతం మేర పెంచుతున్నట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. మంగళవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. లిక్కర్ బాటిల్స్పై ఉండే గరిష్ట చిల్లర ధరకు ఇది అదనం. లాక్డౌన్ కారణంగా భారీగా ఆదాయం కోల్పోయిన ప్రభుత్వానికి ఈ నిర్ణయంతో అదనపు ఆదాయం సమకూర్చనుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మందుబాబులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.