మద్యం ప్రియులకు శుభవార్త. రేపటి నుంచి తెలంగాణలో మద్యం అమ్మకాలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో దాదాపు నెలన్నర రోజులుగా అలమటిస్తున్న మందుబాబులకు పండగొచ్చినట్లయింది. కరోనా వైరస్ నియంత్రణ కోసం మార్చి 22న జనతా కర్ఫ్యూ సందర్భంగా మూతబడిన మద్యం దుకాణాలు లాక్డౌన్ కారణంగా ఇప్పటి వరకూ తెరుచుకోలేదు. అయితే కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మద్యం విక్రయాలను తాజాగా పునఃప్రారంభించాయి. దీంతో రాష్ట్రంలోనూ మద్యం విక్రయాలు చేపట్టాలని సర్కార్ నిర్ణయానికి వచ్చింది.
రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్డౌన్ మే 7తో ముగియనున్న సంగతి తెలిసిందే. దీనిని మరికొన్ని రోజులు పొడిగించే అంశంతోపాటు మద్యం విక్రయాలు, ఇతర సడలింపులపై మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో సమావేశమైన మంత్రి వర్గం పలు కీలక అంశాలపై చర్చించింది. ఈ క్రమంలోనే రేపటి నుంచి మద్యం విక్రయాలను ప్రారంభించాలని, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో మాత్రం మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వకూడదని మంత్రిమండలి నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ అధికారిక ప్రకటన చేయనున్నారు.