లాక్డౌన్ విషయంలో కేంద్రం మార్గదర్శకాలను తెలంగాణలో ఎలాంటి మార్పులు లేకుండా యథావిధిగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను ఇక్కడ కూడా అమలు చేస్తామని ఆయన చెప్పారు. వ్యవసాయ, అనుబంధ రంగాల కార్యకలాపాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
గ్రీన్, ఆరెంజ్ జోన్లలో రూరర్ ఏరియాల్లో అన్ని షాపులను తెరుస్తామని కేసీఆర్ చెప్పారు. మధ్యాహ్నం నుంచి సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గం సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.
ఈనెల 15న మరోసారి సమీక్ష చేసి, సడలింపులపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. రెడ్ జోన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ షాపులను తెరిచే ప్రసక్తే లేదని, కేవలం గృహనిర్మాణ, నిత్యావసర సరుకుల షాపులు మాత్రమే తెరిచి ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. మరికొంత కాలం మనం జాగ్రత్తగా ఉంటే.. కరోనా నుంచి మనం బయటపడుతామని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు లాక్డౌన్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.