మాస్క్ ధరించని వారికి మందుబాటిల్ ఇవ్వొద్దని మద్యంషాపుల నిర్వాహకులను ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో రేపటి నుంచి అన్ని జోన్లలో మద్యం షాపులను తెరుస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అంశాలపై హెచ్చరించారు. మద్యం షాపుల వద్ద కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, మాస్క్ ధరించాలని లేనిపక్షంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఇదే సమయంలో బార్లు, క్లబ్లకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే.. కంటైన్మెంట్ జోన్లలో షాపులకు కూడా అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. మద్యం ధరలను 16శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. తక్కువ ధర మద్యం అంటే చీప్ లిక్కర్పై కేవలం 11శాతం పెంచుతున్నామని తెలిపారు.
ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మద్యం షాపులను తెరుస్తామని పేర్కొన్నారు. కంటైన్మెంట్ జోన్లలోని 15 షాపులు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో షాపులను తెరిచేందుకు అనుమతి ఇస్తూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.