దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,958 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా విజృంభణతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా ఏడు కోట్ల మంది వ్యాపారులు ఉన్న రిటైల్ రంగం నష్టాలను చవిచూస్తోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) లాక్ డౌన్ వల్ల రిటైల్ రంగం 5.5 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయినట్టు ప్రకటన చేసింది.
లాక్ డౌన్ వల్ల వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని... కష్ట కాలంలో వర్తకులను ఆదుకోవడానికి ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని కోరనున్నట్టు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. లాక్ డౌన్ వల్ల కోటిన్నర మంది వ్యాపారులు వ్యాపారాలు మూసేయాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు.
వ్యాపారులకు ఈ విపత్కర పరిస్థితులను తట్టుకునే బలం లేదని వ్యాపారాలు సాధారణ స్థితికి రావడానికి 6 నుంచి 9 నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు.