బుచ్చమ్మ.. అంధురాలు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని వాటర్ వర్క్స్ ఈఈ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తోంది. ఉగాది పండుగ కోసం హయత్నగర్లో నివసించే తనభర్త ప్రేమానందం, కుమారుడి దగ్గరికి మానసిక వికలాంగుడైన సోదరుడు పరమేష్తో కలిసి వచ్చింది. అయితే.. ఇంట్లో భర్తతో జరిగిన చిన్నపాటి గొడవతో ఆమె కలత చెందింది. ఇక అక్కడ ఉండలేనంటూ మంగళవారం తెల్లవారుజామున నల్లగొండకు కాలినడకన పయనమైంది. మానసిక వికలాంగుడైన సోదరుడిని వెంటబెట్టుకుని రోడ్డుమార్గాన బయలుదేరింది. సోదరుడి చేతులు పట్టుకుని విజయవాడ జాతీయ రహధారిపై గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు.
ఈ క్రమంలో అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు చూసి వారిని చేరదీశారు. తన సోదరుడికి కూడా కళ్లు సరిగ్గా కనిపించవని బుచ్చమ్మ తెలిపింది. నల్లగొండకు వెళ్తున్నామని, హయత్నగర్లో తన భర్తతో పాటు ఇద్దరు కుమారులు, కోడలు ఉన్నారని, వారు తమ పట్ల కనికరం చూపకుండా గొడవపడ్డారని బుచ్చమ్మ కన్నీటిపర్యంతమైంది. అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు వారికి భోజనం పెట్టి వాహనం సమకూర్చి నల్లగొండకు పంపించి తమ పెద్దమనసును చాటుకున్నారు.