కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా అనేక మంది ఉపాధి కోల్పోయారు. ప్రధానంగా కొన్ని వృత్తుల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వారి కష్టాలను తీర్చేందుకు కర్నాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలోని మంగళివృత్తి, ఆటో డ్రైవర్లు, బట్టలు ఉతికే వారికి ముఖ్యమంత్రి యడ్యూరప్ప శుభవారం చెప్పారు. దాదాపుగా నలభైరోజులుగా ఉపాధి కోల్పోయిన వీరికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. వీరిలో ఒక్కొక్కరికీ రూ.5వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో సుమారు 60,000 మంది బట్టలు ఉతికేవారు, 2,30,000 మంది మంగళివృత్తి వారు ఈ సాయం పొందనున్నట్లు ఆయన తెలిపారు.
అంతేగాకుండా.. లాక్డౌన్ కారణంగా పూల పెంపకందారులు కూడా తీవ్రంగా నష్టపోయారు. డిమాండ్ లేకపోవడంతో రైతులు పూలను తోటలపైనే వదిలేశారు. రైతులు సుమారు 11,687 హెక్టార్లలో పూలతోటలు పెట్టారని కర్నాటక ప్రభుత్వం అంచనా వేసింది. పంట నష్టం జరిగిన పూల పెంపకందారులకు గరిష్టంగా ఒక హెక్టారుకు పరిమితం చేసి రూ .25 వేల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి యడ్యూరప్ప నిర్ణయంపై ఆయా వర్గాలు హర్శం వ్యక్తం చేస్తున్నాయి.