బిహార్ రాజకీయాల తీరే వేరు..! అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం చేసుకునే విమర్శలు భలేగా ఉంటాయి.. చురకలు అంటించడంలో అందరూ అందరే..! తాజాగా.. అఖిలపక్ష సమావేశంలో నిర్వహించిన సమావేశంలో ఇలాంటి ఘటనే మళ్లీ చోటుచేసుకుంది. ప్రతిపక్ష ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు సెటైర్లతో కూడిన చురకలు అంటించారు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం.. కరోనా పోరులో భాగంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్జేడీ తరపున తేజస్వీ యాదవ్ వచ్చారు. రాష్ట్రంలోని క్వారంటైన్ సెంటర్లను స్వయంగా పరిశీలించి, అధ్యయనం చేయానికి తనతో పాటు రావాలంటూ ముఖ్యమంత్రి నితీశ్ తేజస్వీని అభ్యర్థించారు. దీంతో తేజస్వీ యాదవ్ ఇలా స్పందించారు.
*కోవిడ్పై పోరులో మేమందరమూ మీవెనకే ఉంటాం. మీరు పరిపాలనలో చాలా అనుభవజ్ఞులు. గతంలో యాత్రలు కూడా చేశారు. కానీ మీరు ప్రస్తుతం ప్రణాళికలు వేస్తున్నారు. మీరు వేస్తున్న ప్రణాళికల అమలుపై మాకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. దయచేసి క్షేత్ర స్థాయికి వెళ్లి... క్వారంటైన్ సెంటర్లను పర్యవేక్షిస్తే బాగుంటుంది* అంటూ తేజస్వీ సెటైర్లు వేశారు. దీంతో నితీశ్ ఏం తక్కువ! ఆయన కూడా అదేస్థాయిలో స్పందించారు. *‘కరోనా మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొనే ప్రయాణించాలనుకోవడం లేదు. లాక్డౌన్ మార్గదర్శకాలను సడలించగానే కచ్చితంగా క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్తా. మీరూ నాతో రావచ్చు. క్షేత్ర స్థాయి పరిస్థితులను అధ్యయనం చేయవచ్చు* అని ముఖ్యమంత్రి నితీశ్ బదులిచ్చారు. ఇది ముందుముందు ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి మరి.