కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలులో సడలింపులు ఇవ్వడంతో పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్నాటక, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయితే.. ఇందులో కొన్ని రాష్ట్రాలు ఏకంగా మద్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు నిర్ణయించాయి. ఈ క్రమంలో పంజాబ్లో మద్యం డోర్ డెలివరీకి ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నూతన మార్గదర్శకాలు జారీచేసింది. లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో మద్యం దుకాణాల యజమానులు ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించకూడదని సీరియస్గా ఆదేశించింది.
మద్యం డోర్ డెలివరీ ఇచ్చేందుకు వాహనంపై ఇద్దరికి మించి వెళ్లకూడదని, తప్పనిసరిగా ముఖాలకు మాస్కులు ధరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, వినియోగదారులకు మద్యం అందజేసేటప్పుడు సామాజిక దూరం పాటించాలని నూతన మార్గదర్శకాల్లో పంజాబ్ ఎక్సైజ్ శాఖ పేర్కొంది. ఎక్సైజ్ శాఖ ఆమోదించిన వాహనాన్ని మాత్రమే మద్యం డోర్ డెలివరీగా ఉపయోగించాలని సూచించింది. పశ్చిమబెంగాల్లో కూడా మద్యం డోర్ డెలివరీకి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఇదే దారిలో మరికొన్ని రాష్ట్రాలు కూడా నడిచే అవకాశాలు ఉన్నాయి.