విశాఖలోని గోపాలపట్నం పరిధి ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో ప్రమాదకరమైన గ్యాస్ లీకేజీతో దారుణమైన, హృదయవిదారకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. తెల్లవారుజామున 4గంటలకు చోటుచేసుకున్ ఈ ప్రమాదంతో భయానక పరిస్థితి నెలకొంది. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. ఎక్కడికక్కడ స్పృహతప్పి పడిపోయారు. ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మరణించారు. వెంకటాపురం చుట్టుపక్కల్లోని బావులు, కాలువల్లో పడి పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పరుగులు తీసే క్రమంలో వెంకటాపురం గ్రామంలో గంగరాజు అనే వ్యక్తి నేలబావిలో పడిపోయి చనిపోయాడు.
మరోవైపు కొట్టాల్లో కట్టేసి ఉన్న వేలాది పశువులు మృత్యవాతపడ్డాయి. కొట్టాల్లో గుంజలకు కట్టేసి ఉన్న పశవులు అలాగే ప్రాణాలు వదిలాయి. ఎక్కడికక్కడ నేలకూలాయి. అదేవిధంగా ఈ గ్యాస్తో కంపెనీకి దాదాపుగా రెండు మూడు కిలోమీటర్ల దూరంలోని పచ్చని చెట్లన్నీ మాడిపోయాయి. ఎటుచూసినా.. భయానక పరిస్థితులే నెలకొన్నాయి. దాదాపుగా ఈ గ్యాస్ ప్రభావం సుమారు 48గంటలపాటు ఉంటుందని అధికారవర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరింత భయానక పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వేలాది పశువుల మృత్యువాతతో రైతులు తీవ్ర నష్టమే జరుగుతుందని, వ్యవసాయపనులపై తీవ్ర ప్రభావం పడుతుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాలు రైతులను మరింత కష్టాల్లోకి నెడుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.