విశాఖపట్నంలోని ఆర్ ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గురువారం తెల్లవారు జామున లీకైన గ్యాస్తో భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎల్జీ పాలిమర్స్ నుంచి ప్రమాదవశాత్తు లీకైన విషవాయువు పీల్చి చుట్టుపక్కల ఉండే ప్రజలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ విషవాయువు పీల్చి అనేకమంది రోడ్లపైకి వచ్చి భయానక స్థితిలో పడిపోయి ఉన్నారు. ఇప్పటికే సుమారు పదిమంది వరకు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. అసలు గ్యాస్ అంటే ఎమిటి..? ఎందుకు లీకేజీ జరిగిందన్నదానిపై పలువురు నిపుణులు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. లాక్డౌన్ కారణంగా దాదాపుగా 40 రోజులుగా కంపెనీని మూసివేశారు. అయితే.. మెయింటనెన్స్ కోసం మాత్రం షిప్టులవారీ ప్రభుత్వం 45మంది సిబ్బందికి ప్రత్యేక పాస్లు ఇచ్చింది.
లాక్డౌన్ కారణంగా కంపెనీలో దాదాపుగా 2వేల మెట్రిక్ టన్నుల స్టెరిన్ను నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత దాదాపుగా 20డిగ్రీల సెల్సియస్లోపే ఉండాలట. కానీ.. తిరిగి గురువారం అర్ధరాత్రి కంపెనీని ప్రారంభించే క్రమంగా ఒక్కసారిగా వేడి పెరిగి గ్యాస్ లీకైనట్లు పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీనుంచి లీకైన గ్యాస్ను పీవీసీ గ్యాస్ లేక స్టెరిన్ గ్యాస్ అంటారని చెబుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన గ్యాస్ అని చెబుతున్నారు. సింథటిక్ రబ్బర్, ప్లాస్టిక్, డిస్పోసబుల్ కప్పులు, కంటైనర్లు, ఇన్సులేషన్..ఇలా పలు ఉత్పత్తుల్లో దీనిని ఉపయోగిస్తారు.