భారత్లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ అధికమవుతోంది. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లోనే కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. అందులోనూ మహారాష్ట్రలోనే రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అంతేకాకుండా రోజురోజుకూ కొవిడ్-19బారిన పడుతున్న వైద్యులు, నర్సులు, పోలీసుల సంఖ్య ఎక్కువ అవుతోంది. తాజాగా ముంబైలోని జెజె మార్గ్ పోలీస్ స్టేషన్కు చెందిన 26 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వీరిలో 12 మంది ఉన్నతాధికారులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వీరందరినీ ప్రస్తుతం క్వారంటైన్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన అధికారులతో కాంటాక్ట్ ఉన్న మిగతా పోలీసులను కూడా క్వారంటైన్కి తరలిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు ముంబైలో దాదాపు 250 మంది పోలీసులకి కరోనా సోకిందని ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చెప్పారు. కాగా, ఇప్పటికే ముగ్గురు పోలీసులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో పోలీస్ కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా 52 వేలకు పైగానే కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా 14,541 కేసులు నమోదవ్వగా, 583 మంది మరణించారు.