విశాఖలోని ఆర్ ఆర్ వెంకటాపురం సమీపంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటనపై దక్షిణ కొరియా స్పందించింది. ఢిల్లీలో ఉన్న కొరియన్ దౌత్యవేత్త షిన్బాంగ్ ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అందులో పేర్కొన్నారు. గ్యాస్ లీకేజీతో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, ఈ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ దక్షిణ కొరియాకు చెందిన కంపనీ అన్న విషయం తెలిసిందే. గురువారం తెల్లవారు జామున పరిశ్రమలోని ట్యాంకుల నుంచి గ్యాస్ లీకై దాదాపుగా ఐదారు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
శ్వాస ఆడక ఎక్కడివాళ్లు అక్కడ కుప్పకూలిపోయారు. ఈ క్రమంలోనే పలువురు కాలువు, బావుల్లో పడిపోయారు. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు బాధితులను ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 10మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ గ్యాస్ ప్రభావం మరో రెండు రోజుల వరకు ఉండే ప్రమాదం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాగా, ఈ ఘటనకు కంపెనీయే పూర్తి బాధ్యత వహించాలన్న డిమాండ్ పెరుగుతోంది.