విశాఖలో గ్యాస్ లీకేజీ సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంఘటనపై అధికారులతో చర్చించారు. గ్యాస్ లీకేజీ, అనంతరం తీసుకున్న చర్యలపై జిల్లా కలెక్టర్ వివరించారు. ముఖ్యమంత్రికి అంతకు ముందు సీఎం జగన్ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అంతకుముందు గ్యాస్ బాధితులు చికిత్స పొందుతున్న కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడారు. బాధితులకు అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అందరికీ మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఆయన సూచించారు.
అనంతరం పలువురు బాధితులతో స్వయంగా మాట్లాడారు. ఒక్కొక్కరి వద్దకు వెళ్తూ వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓపిగ్గా వారి బాధలను విన్నారు. గ్యాస్ లీకైన సమయంలో నెలకొన్న భయానక పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా వృద్ధులైన బాధితులను ఆయన పలకరించారు. వారు చెబుతున్న విషయాలను శ్రద్ధగా విన్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ వారిలో భరోసా నింపారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన ధైర్యం చెప్పారు.