గ్యాస్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్లే పాలిమరైజేషన్ జరిగి ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఎల్జీ కంపెనీలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమైని ఆయన అన్నారు. విశాఖలో గ్యాస్ లీకేజీ సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంఘటనపై అధికారులతో చర్చించారు. గ్యాస్ లీకేజీ, అనంతరం తీసుకున్న చర్యలపై జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, నివేదిక అందించేందుకు కలెక్టర్, సీపీతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. నిజానికి.. ప్రమాదం జరిగిన సమయంలో అలారమ్ మోగాలని, కానీ మోగకపోవడానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు.
ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అందరూ వెంటనే స్పందించి, సహాయక చర్యలు చేపట్టారని ఆయన అన్నారు. అధికారులందరూ సమర్థవంతంగా పనిచేసి, బాధితులను ఆదుకున్నారని అన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. ప్రతీ ఒక్కరినీ ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.