మే 11 నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించాలని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సచివాలయంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో మే 11 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నట్లు మంత్రి సూచన ప్రాయంగా తెలిపారు. లాక్ డౌన్ ముగిసిన అనంతరం రెడ్ జోన్ లో మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు అనుసరించి, కోవిడ్-19 జాగ్రత్తలను  పాటిస్తూనే మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చిలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రథమ సంవత్సరంలో 5,46,162 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,18,280 మంది విద్యార్థులు హాజరయ్యాయరని తెలిపారు. మొత్తంగా  10,64,442 మంది విద్యార్థినీ, విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. వీరికి సంబంధించి సుమారు 60 లక్షల పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉందని మంత్రి వివరించారు. 

 

13 జిల్లాల్లోనూ మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ప్రత్యేకంగా గుర్తించిన రెండు, మూడు భవనాలను మూల్యాంకన కార్యకలాపాలకు వినియోగించనున్నామన్నారు. మూల్యాంకన ప్రక్రియ ముగిసేదాకా కేటాయించిన భవనాల్లో సిబ్బందికి కావలసిన భోజనం, వసతి ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిరోజూ ఉదయం 8 గం.ల నుండి మధ్యాహ్నం 1 గం. వరకు ఒక షిప్టు, మధ్యాహ్నం 1 గం. నుండి సాయంత్రం 6 గం.ల వరకు మరో షిప్టులో మూల్యాంకన ప్రక్రియ జరుగుతుందన్నారు.  ఉదయం 15, మధ్యాహ్నం 15 జవాబుపత్రాలు ప్రతిరోజూ మూల్యాంకనం చేయాల్సి ఉంటుందని అధికారులకు సూచించారు. లాక్ డౌన్ నేపథ్యంలో సంబంధింత అధికారులకు ఎటువంటి  ఇబ్బందులు కలగకుండా చూస్తామని భరోసానిచ్చారు. మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనే అధికారులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ ను వినియోగించాల్సి ఉంటుందన్నారు. మూల్యాంకన ప్రక్రియలో 25 వేల మంది సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. తొలుత ఆరెంజ్, గ్రీన్ జోన్ లో సుమారు 15వేల మందితో ఈ మూల్యాంకన ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. రెడ్ జోన్ లో 8 నుండి 10 వేల మంది సిబ్బంది అవసరమవుతారని అంచనా వేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: