విశాఖపట్నంలోని ఆర్ ఆర్ వెంకటాపురం గ్రామ సమీపంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ ఘటన మరవకముందే ఛతీస్గఢ్లో మరో గ్యాస్ లికేజీ ఘటన చోటు చేసుకుంది. రాయ్గఢ్లోని పేపర్ మిల్లులో గ్యాస్ లీకై ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు, స్థానికులు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, కరోనా వైరస్ కట్టడికి కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా దాదాపు నెలన్నర రోజులుగా పరిశ్రమలు అన్ని మూతపడ్డాయి.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వడవంతో దేశంలోని పలు పరిశ్రమలు తెరచుకున్నాయి. ఈ క్రమంలో రాయ్గఢ్లోని పేపర్ మిల్లు కూడా ప్రారంభమయింది. గురువారం మధ్యాహ్నం మిల్లులోని ట్యాంక్ను శుభ్రం చేసేందుకు ఏడుగురు కార్మికులు అందులోకి వెళ్లారు. ట్యాంకులోకి దిగి శుభ్రం చేస్తున్న క్రమంలో గ్యాస్ లీకై తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అస్వస్థతకు గురైన కార్మికులను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.