కరోనా వైరస్ కట్టడికి కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా తెలంగాణలో నిలిచిపోయిన పదోతరగతి పరీక్షల నిర్వహణ కోసం పరీక్ష కేంద్రాలను రెట్టింపు చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 2,530 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయగా.. ప్రస్తుతం విద్యార్థులు భౌతికదూరం పాటించేలా బెంచ్కు ఒక్కరే కూర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు అనుమతితో పది పరీక్షల నిర్వహణకు రీషెడ్యూల్, ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్, ఫలితాల విడుదల తదితర అంశాలపై గురువారం హైదరాబాద్లో ఆమె అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైకోర్టు అనుమతితో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం తీసుకున్న జాగ్రత్తలను కోర్టుకు వివరిస్తామని, ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేస్తామని మంత్రి చెప్పారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లకు మాస్కులు, శానిటైజర్ల ఏర్పాటు, థర్మల్ స్క్రీనింగ్ చేస్తామని ఆమె పేర్కొన్నారు. నిత్యం పరీక్ష కేంద్రాల్లో శానిటైజ్ చేపడుతామని తెలిపారు. అనారోగ్యంతో ఉన్న విద్యార్థులకు ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు.