భారత దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రోజుకు సుమారు మూడు నాలుగువేలకు పైగానే కేసులు నమోదు అవుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రి నాటికి ఐదువేలకు పైగా కొత్త కేసులు నమోదుకాగా... 89 మంది మరణించారు. దీంతో 56,391 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,811కు చేరుకున్నది. ఇప్పటివరకు దాదాపు 16 వేలమంది కోలుకున్నారు. ఈ మేరకు పీటీఐ రాత్రి 11:గంటలకు వివరాలు వెల్లడించింది.
కాగా, గత 24 గంటల్లో దేశంలోని 13 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని కేంద్రం వెల్లడించింది. కేరళ, జమ్ముకశ్మీర్, ఒడిశా తదితర రాష్ర్టాలు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే.. పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వవర్గాలు, ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఓవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. వైరస్ ప్రభావం మాత్రం తగ్గకపోవడంతో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ముందుముందు ఈ సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.