24 గంటలు గడవకముందే ముఖ్యమంత్రి జగన్ మాట నిలబెట్టుకున్నారు. విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం పరిహారం విడుదల చేశారు. ఒక్కో మృతుడి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చొప్పున విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చికిత్స పొందుతున్నవారికి, బాధిత గ్రామాల ప్రజలకు, పశువులను కోల్పోయిన రైతులకు హామీ ఇచ్చిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.30కోట్లను విడుదల చేసింది. కాగా, విశాఖలోని ఆర్ ఆర్ వెంకటాపురం గ్రామ సమీపంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్కంపెనీలో స్టెరిన్ లీకైన ఘటన బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో సుమారు ఐదుగ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. వందలమంది ఆస్పత్రులపాలయ్యారు. సుమారు 12 మంది మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ నిన్న హుటాహుటిన విశాఖకు చేరుకుని కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ పరిహారం ప్రకటించారు.