ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్కు వ్యాక్సిన్ను కనిపెట్టేందుకు అనేక ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఎవరిప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఇజ్రాయెల్ దేశం కీలక ముందడుగు వేసింది. కరోనా వైరస్కు విరుగుడుగా యాంటీ బాడీలను తయారుచేసినట్లు ప్రకటించింది. కరోనా వైరస్ను యాంటీబాడీలు నిర్వీర్యం చేస్తున్నాయని ప్రకటించింది. తర్వరలోనే పెద్దమొత్తంలో ఉత్పత్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. తాజాగా.. యాంటీ బాడీల తయారీకి భారత్ బయోటెక్కు సీఎస్ఐఆర్ అనుమతినిచ్చింది. ఎన్ఎంఐటిఎల్ఐ ప్రోగ్రాంలో భాగంగా కొవిద్ నియంత్రణకు ఉపయోగపడే.. మానవ మోనోక్లోనల్ యాంటీ బాడీస్ తయారీ ప్రాజెక్టును సీఎస్ఆర్ఐ భారత్ బయోటెక్కి అప్పగించడం గమనార్హం.
అలాగే.. ఈ ప్రాజెక్టులో భాగంగా నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండస్ట్రీ ప్రిడామిక్స్ టెక్నాలజీతో కలసి భారత్ బయో టెక్ పని చేయనుంది. ఈ మోనోక్లోనల్ యాంటీ బాడీస్ మానవ శరీరంలోని కరోనా వైరస్ను అత్యంత వేగంగా నియంత్రించగలవని వైద్యనిపుణులు చెబుతున్నారు. దీంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం సులభతరం కానుంది. కాగా, వ్యాక్సిన్ కన్నా వేగంగా మోనోక్లోనల్ యాంటీ బాడీస్ ప్రభావవంతంగా పనిచేయగలవని భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా చెప్పడం గమనార్హం.