సంక్షోభ సమయంలో ప్రజలకు సేవ చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ ముందే ఉంటుందని నారా భువనేశ్వరి అన్నారు. కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు తమవంతు సాయం చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. భౌతికదూరం పాటిస్తూ 20 వేల మంది పేదలకు నిత్యావసరాలు అందించామని ఆమె అన్నారు. బియ్యం, కూరగాయలు, నూనె, పండ్లు, గుడ్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2.5 లక్షల మందికి ఎస్ఎస్ 99 మాస్కులు పంపిణీ చేశామని అన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని బారి నుంచి మనల్నిమనం కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని భువనేశ్వరి వివరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ రక్తనిధి కేంద్రం 24 గంటలూ అత్యవసర సేవలు అందిస్తోందని ఆమె తెలిపారు. హైదరాబాద్, విశాఖ, తిరుపతి బ్లడ్ బ్యాంకుల ద్వారా 5 వేల యూనిట్ల రక్తం అందజేశామని తెలిపారు. మూడు వేల మంది కూలీలకు పులిహార, బిస్కట్ ప్యాకెట్లు పంపిణీ చేశామని నారా భువనేశ్వరి వివరించారు.