దేశవ్యాప్తంగా కరోనా పేషెంట్లకు పలు ఆస్పత్రులు ప్లాస్మా థెరపీని అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 113 ఆస్పత్రులు దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 28 ఆస్పత్రులకు మాత్రమే అనుమతి ఇచ్చింది ఐసీఎంఆర్. తాజాగా.. కరోనా రోగులపై ప్లాస్మా ట్రయల్స్ చేసేందుకు సికింద్రాబాద్ గాంధీ దవాఖానతతోపాటు హైదరాబాద్లోని ఈఎస్ఐసీ హాస్పిటల్కు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శుక్రవారం అనుమతి ఇచ్చింది. దీంతో త్వరలోనే ఈ రెండు ఆస్పత్రులలో ప్లాస్మా థెరపీని అందించనున్నారు. అలాగే గుజరాత్లో 5, రాజస్తాన్లో 4, పంజాబ్లో ఒకటి, మహారాష్ట్రలో 5, తమిళనాడులో 4, మధ్యప్రదేశ్లో 3, ఉత్తరప్రదేశ్లో 2, కర్ణాటక, చండీగఢ్లో ఒక్కో దవాఖానకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది.
మరో 83 ఆసుపత్రుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని ఐసీఎంఆర్ వెల్లడించింది. అయితే.. దరఖాస్తుల పరిశీలనలో హైదరాబాద్లోని అపోలో, ఏఐజీ దవాఖానలు కూడా ఉన్నాయని ఐసీఎంఆర్ తెలిపింది. ప్రస్తుతం కరోనా వైరస్కు వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా కరోనా బాధితులకు ప్లాస్మా థెరపీని అందిస్తున్నారు. అయితే.. దీనిని సరైన విధానంలో ఉపయోగించపోతే.. బాధితుల ప్రాణాలకే ప్రమాదమని కేంద్ర హెచ్చరించిన విషయం తెలిసిందే.