తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పాలిసెట్–2020 దరఖాస్తుల గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) కార్యదర్శి యూవీఎస్ఎన్ మూర్తి తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆయన సూచించారు. అలాగే పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ఐటీఐ పూర్తయిన విద్యార్థులు చేరేందుకు నిర్వహించే ల్యాటరల్ ఎంట్రీ ఇన్ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.
అయితే.. కరోనా వైరస్ కట్టడికి కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా దాదాపుగా అన్నిరంగాల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రధానంగా విద్యారంగం పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారోనని ఆందోళన చెందుతున్నారు. అయితే.. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపేందుకు అన్నిచర్యలు తీసుకుంటోంది. వారికి అనుకూలంగా పలు పరీక్షల తేదీలను ఇప్పటికే ప్రకటించింది.