మహారాష్ట్రాలోని ఔరంగాబాద్ జిల్లాలో గూడ్స్ రైలు ఢీకొని 16 మంది వలస కూలీలు మృతి చెందిన ఘటన గుండెల్ని పిండేసింది. దేశాన్ని దిగ్ర్భాంతికి గురిచేసింది. అత్యంత విషాద ఘటనగా నిలిచింది. అయితే.. ఆ 16 మంది వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ట్రైన్ పాస్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వారంతా 15 రోజుల క్రితమే దరఖాస్తున్న చేసుకున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని ఉమారియా, షాడోల్, మాండ్ల జిల్లాలకు చెందిన ఈ వలస కార్మికులు పక్షం రోజుల క్రితం దరఖాస్తు పెట్టుకుంటే అది ఎందుకు పరిష్కారం కాలేదో దానిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
ట్రైన్ పాస్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ప్రమాదం నుంచి బయటపడిన కార్మికులు చెబుతున్నారు. జాల్నాలోని స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీలు నడిచి సొంతరాష్ట్రాలకు బయలుదేరారు. కర్మద్ వరకు వచ్చిన తర్వాత అలిసిపోయి రైలు పట్టాలపైనే పడుకున్నారు. ప్రాణాలతో బయటపడిన నలుగురు పట్టాలకు కొంతదూరంలో నిద్రిస్తున్నారు. రోడ్లపై నడుచుకుంటూ వెళుతున్న వలస కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో రైలు పట్టాల వెంబడి నడిచామని ప్రాణాలతో బయటపడిన బాధితులు తెలిపారు. రాత్రివేళ జరిగిన ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది.