భారత్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదు అవుతున్నాయి. అందులోనూ దేశవాణిజ్య రాజధాని ముంబైలోనే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. అమెరికాలో కరోనాకు హాట్స్పాట్గా న్యూయార్క్ సిటీ మారింది. యూఎస్ వ్యాప్తంగ నమోదు అవుతున్న కేసుల్లో అత్యధికంగా న్యూయార్క్ సిటీలోనే నమోదు అవుతున్నాయి. ఇక భారత్లో కరోనాకు హాట్స్పాట్గా ముంబై మారుతోంది. మహారాష్ట్రలో నిన్న కొత్తగా 1,165 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 48 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో 27 మంది ముంబై వాసులు కాగా, తొమ్మిది మంది పుణె నగర వాసులు, ఎనిమిది మంది నాసిక్ జిల్లాలోని మాలేగావ్ నివాసులు, పుణె, అకోలా, నాందేడ్, అమరావతి జిల్లాల వారు ఒక్కొక్కరు ఉన్నారు.
కాగా, ఇప్పటి వరకు రాష్ట్రం వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,228కి, మరణాలు 779కి చేరాయి. ఒక్క ముంబై పరిధిలోనే ఏకంగా 12,864 మంది కరోనాతో బాధపడుతుండగా, 489 మంది మరణించారు. పుణెలో 141 మరణాలు సంభవించాయి. 2,27,804 మందిని పరీక్షించగా, 2,41,290 మందిని హోం క్వారంటైన్ చేశారు. ఈ పరిణామాలతో తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి.