కరోనా వైరస్ కారణంగా అనేక దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వందేభారత్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి విమానం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. కువైట్లో చిక్కుకుపోయిన వారిని కేంద్ర ప్రభుత్వం తరలించింది. అక్కడి నుంచి శనివారం రాత్రి 10.07 గంటలకు ఎయిరిండియా ఏఐ 988 విమానం 163 మంది ప్రయాణికులతో చేరుకుంది. వీరిలో ఎక్కువ మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వలస కార్మికులు ఉన్నట్లు తెలిసింది. దిగిన వెంటనే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు, కస్టమ్స్ తనిఖీలు చేపట్టిన అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 15 బస్సుల్లో క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
కాగా, విదేశాల నుంచి వచ్చే వారికి సొంత ఖర్చులతో హోటళ్లలో క్వారంన్టైన్ అవకాశం కేంద్రం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ నుంచి వచ్చిన వారి కోసం హైదరాబాద్లో నాలుగు హోటళ్లు సిద్ధం చేశారు. హైటెక్సిటీ సమీపంలోని షెరటాన్ హోటల్, గచ్చిబౌలిలోని రెడ్ ఫాక్స్ హోటల్ను ఎక్కువ చార్జీ కేటగిరీలో కేటాయించారు. ఇక్కడ ఒక్కొక్కరికి భోజనంతో కలుపుకొని రూ.30 వేలు (క్వారంటైన్ మొత్తానికి) చార్జీ చేస్తారు. రూ.15 వేల కేటగిరీ కింద కామత్ లింగాపూర్, కాచిగూడలోని ఫ్లాగ్షిప్ హోటళ్లను కేటాయించారు అధికారులు.