కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రోజువారీగా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుసందర్భాల్లో అమెరికాలో కరోనా మరణాలు లక్ష ఉంటాయని పేర్కొన్నారు. ఒకానొక దశలో అంతకుమించి కూడా ఉంటాయని కూడా చెప్పారు. ప్రస్తుతానికి అయితే.. ఆయన చెప్పిందే నిజమవుతోంది. ప్రస్తుతం అమెరికాలో మృతిచెందిన వారి సంఖ్య 80 వేలు దాటింది. అయితే.. ఇక్కడ ఆశాజనమైన విషయం ఏమిటంటే.. రోజువారీగా సంభవించే మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో వైరస్ వల్ల 876 మంది ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలో అత్యధిక స్థాయిలో వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు 13,66,962 మందికి వైరస్ సోకినట్లు తేలింది. అమెరికాలో రికవర్ అయిన కేసుల సంఖ్య 210684గా ఉన్నది. తాజా మరణాల సంఖ్యతో అమెరికాలో మరణాల రేటు 5.9 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా వైరస్ సంక్రమించిన వారి సంఖ్య 4024009గా ఉన్నది. దీంట్లో 279311 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ వల్ల మరణాల రేటు 6.9 శాతం ఉన్నది.