దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కరానో కేసుల్లో మహారాష్ట్రలోనే అత్యధికంగా నమోదు అవుతున్నాయి. అందులోనూ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. ఇక్కడ ఇంతలా కేసులు నమోదు కావడానికి కరోనా కమ్యూనిటీ స్ర్పెడ్ కారణమని, ఇందుకు కొన్ని ఆధారాలు కూడా లభించాయని మహారాష్ట్ర వ్యాధి పర్యవేక్షణ అధికారి డాక్టర్ ప్రదీప్ అవతే చెప్పడం గమనార్హం. ముంబైతోపాటు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ ఆధారాలు లభించినట్లు ఆయన వెల్లడించారు. దీనిపై మరింత అధ్యయనం చేస్తున్నామని వెల్లడించారు. దేశ వాణిజ్య రాజధాని ముంబై. ఇక్కడ చాలా భిన్నమైన వాతావరణం ఉంటుంది. అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం. ఒక చదరపు కిలోమీటరుకు 20,000 మంది ఇక్కడ నివసిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 22,000పైగా కరోనా వైరస్ కేసులతో దేశంలోనే మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. 832 మంది మరణించగా, 4199 మంది రోగులు ఈ వ్యాధి నుండి కోలుకున్నారు. ఇందులో ఏకంగా ముంబైలోనే 12,000పైగా కొవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19 ప్రభావిత ప్రాంతాలలో థానే మరియు పూణే కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలో ముందుముందు కరోనా వైరస్ ప్రభావం మరింతగా ఉండే ప్రమాదం ఉందని అధికావర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా 67,152 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో 44,029 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 20,916 మంది రోగులు కోలుకున్నారు. ఇప్పటివరకు 2,206 మంది మరణాలు సంభవించాయి.