కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో విదేశాల్లో భారతీయులు చిక్కుకున్నారు. అయితే..కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందేభారత్ మిషన్తో వారందరూ ఇండియాకు తిరిగివస్తున్నారు. ప్రత్యేక విమానాలు, షిప్లలో కేంద్ర ప్రభుత్వం భారతీయులను తీసుకొస్తోంది. అయితే.. విదేశాలను వచ్చిన ఆంధ్రప్రదేశ్వాసులు మాత్రం సొంత రాష్ట్రానికి చేరుకోలేకపోతున్నారు. విదేశాల నుంచి ప్రత్యేక విమానాల్లో వచ్చిన ఏపీవాసులు హైదరాబాద్లోనే చిక్కుకుపోతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే తెలంగాణవారితోపాటు ఏపీవాసులనూ డైరెక్ట్గా పెయిడ్ క్వారంటైన్లకు తరలిస్తున్నారు. హైదరాబాద్లోని హోటళ్లలో ఏర్పాటు చేసిన పెయిడ్ క్వారంటైన్ల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఒక్కరికి రూ.30వేలు తీసుకుంటున్నారు.
అయితే.. తమను సొంత రాష్ట్రానికి పంపించాలని ఏపీవాసులు కోరుతున్నారు. తాము ఇక్కడిదాకా వచ్చి సొంత ప్రాంతానికి వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విమానాలను నేరుగా ఏపీకే నడిపించాలని కోరుతున్నారు. కానీ.. అందుకు నిబంధనలు ఒప్పుకోవని తెలంగాణ సర్కార్ చెబుతోంది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా అటు కేంద్రం, ఇటు తెలంగాణ సర్కార్తో సంప్రదింపులు జరుపుతోంది. గల్ఫ్ నుంచి ఏపీవాసులు పెయిడ్ క్వారంటైన్లలో ఉండలేరని, వారికి అంత స్థోమత లేదని ఏపీ సర్కార్ చెబుతోంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.