లాక్డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లను నడిపిస్తున్న విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న కూలీలను తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తోంది. తాజాగా.. తమిళనాడులో చిక్కుకున్న 889మంది వలస కూలీలు శ్రామిక్ రైలులో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సిక్కోలుకు ఈ రోజు ఉదయమే చేరుకున్నారు.
వెంటనే అప్రమత్తమైన అధికారులు వీరందరినీ క్వారంటైన్కు తరలించేందుకు 32 బస్సులను ఏర్పాటు చేశారు. నిజానికి.. చాలా రోజులుగా తమిళనాడులో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీరిని తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి.. శ్రామిక్ రైలులో వలస కార్మికులను తీసుకొచ్చారు. దీంతో కూలీల కుటుంబాలు ఆనందపడుతున్నాయి. ఏపీ సర్కార్కు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇటీవల గుజరాత్ నుంచి ప్రత్యేక బస్సుల్లో ఏపీ మత్స్యకారులను తీసుకొచ్చిన విషయం తెలిసింది.