చిన్నపాటి సమస్య వచ్చినా.. సెలవు తీసుకొని హాయిగా ఇంటివద్ద ఉండే ఉద్యోగులే మనకు ఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ.. ఎంతకష్టం వచ్చినా.. చేసే పనిని ప్రాణపథంగా ప్రేమించే వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. తాజాగా.. కర్నాటక రాష్ట్రంలో ఓ తొమ్మిది నెలల నిండుగర్భిణి విధులకు హాజరవుతూ నర్సుగా సేవలు అందిస్తోంది. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో నర్సుగా సేవలందిస్తూ వృత్తి, ప్రజల సేవ పట్ల తనకున్న ప్రేమను చాటుకుంటోంది. తీర్థహల్లి తాలూకాలోని గజనూర్ గ్రామానికి చెందిన రూపా పర్వీన్ రావు అనే మహిళ తొమ్మిది నెలల గర్భిణీగా ఉన్నా..సెలవు తీసుకోకుండా జయచామ రాజేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు సేవలందిస్తోంది.
ఈ సందర్భంగా రూపా పర్వీన్ రావు మాట్లాడుతూ..ఈ ఆస్పత్రి పరిధిలో చాలా గ్రామాలున్నాయని... ప్రజలకు వైద్య సిబ్బంది సేవలు అవసరమని చెప్పారు. తనను సెలవు తీసుకోమని సీనియర్లు చెప్పారని... కానీ ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేయాలనుకున్నానని ఆమె అన్నారు. రోజూ ఆరు గంటలు పనిచేస్తున్నానని... సీఎం యెడియూరప్ప తనకు ఫోన్ చేసి అభినందించారని.. వృత్తిపట్ల ఉన్న నిబద్ధత ప్రశంసించారని ఆమె వివరించారు. సీఎం కూడా తనను విశ్రాంతి తీసుకోమన్నారని రూపా పర్వీన్ రావు చెప్పింది. ఈ సందర్భంగా వృత్తిపట్ల ఆమె అంకితభావాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.