కరోనా వైరస్ కట్టడికి కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న కార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు కాలినడకన బయలుదేరుతున్నారు. మండుటెండలో వందల కిలీమీటర్లు నడుస్తున్నారు. ఈక్రమంలో పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా.. మరో కార్మికుడు నడిచీ...నడిచీ తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచాడు. పనులు లేకపోవడంతో స్వస్థలానికి బయల్దేరిన మరో వలస కార్మికుడు మృతిచెందాడు.
ఒడిశాలోని మల్కన్గిరికి చెందిన వలస కార్మికులు హైదరాబాద్ నుంచి మే 10వ తేదీన బయల్దేరారు. కాలినడకన వెళ్తున్న వలస కార్మికులు సోమవారం భద్రాచలం చేరుకున్నారు. అందులోని ఓ యువకుడు వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతని సహచరులు వెంటనే భద్రాచలంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించాడని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. తోటి కార్మికులు కన్నీటిపర్యంతమయ్యారు.