కరోనా వైరస్ కారణంగా దాదాపుగా అన్నిరంగాల కార్యకలాపాలు ఆగిపోయాయి. అనే క్రీడా టోర్నీలు కూడా వాయిదా పడ్డాయి. మరికొన్ని ఏకంగా రద్దు అయ్యాయి. ఇక భారత్లో ఐపీఎల్ క్రేజీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్ రద్దయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కు దాదాపు రూ.4వేల కోట్లు నష్టం వాటిల్లుతుందని బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ వెల్లడించారు. నిజానికి.. తొలుత షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ఈ ఏడాది ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కావాలి. కానీ.. కరోనా వైరస్ ప్రభావంతో ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా పడింది.
అయితే ఆ తర్వాత కూడా వైరస్ తీవ్రరూపం దాల్చడంతో ఈ ఏడాది సీజన్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుందా..? లేదా..? అందరిలో ఉత్కంఠ రేగుతోంది. ఈ సీజన్ రద్దయితే వచ్చే నష్టాన్ని తాజాగా ధుమాల్ వెల్లడించారు. ఈ ఏడాది ఐపీఎల్ రద్దయితే బీసీసీఐకి భారీ నష్టం వస్తుందని... అది సుమారు రూ.4వేల కోట్లు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ నష్టం మరింత ఎక్కువగా ఉన్నా ఉండొచ్చునని అన్నారు. అయితే.. ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించగలమో లేదో ప్రస్తుతానికైతే కచ్చితంగా చెప్పలేమని అని ధుమాల్ చెప్పారు.