దేశ రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ పట్టుకోల్పోతోంది. అనేక రాష్ట్రాల్లో ఉనికిపాట్లు పడుతోంది. ప్రధాని మోడీకి ఎదుర్కొనే సత్తా ఉన్న నేతలెవరూ లేకపోవడంతో పార్టీ తీవ్ర అవస్థలు పడుతోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడంతో ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షపదవికి రాహుల్గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం పార్టీని కుదిపేసింది. దీంతో అప్పటి నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగుతున్నారు. అయితే..ఇదే సమయంలో పలు రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుపులో రాహుల్గాంధీ కీలక పాత్ర పోషించారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆయన కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులతో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో తాజా పరిణామం ఏమిటంటే.. మళ్లీ రాహుల్గాంధీని జాతీయ అధ్యక్షుడిని చేయాలని, మొత్తం 11మంది యువనేతలతో టీమ్ను తయారు చేయాలని సోనియాగాంధీతోపాటు పలువురు వృద్ధ నేతలు కూడా అంటున్నట్లు తెలుస్తోంది.
అలా అయితేనే.. కాంగ్రెస్ పార్టీ బతుకుతుందని, లేనిపక్షంలో పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందన్న ఆందోళన వృద్ధ నేతల్లో కలుగుతున్నట్లు సమాచారం. యువ నేతలతో టీమ్ను ఏర్పాటు చేస్తేనే తాను బాధ్యతలు తీసుకుంటానని రాహుల్గాంధీ కండిషన్లు పెడుతున్నట్లు ఢిల్లీలో టాక్ వినిపిస్తోంది. ఇందుకు సోనియాగాంధీ, కీలక వృద్ధనేతలు కూడా ఓకే చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే మళ్లీ రాహుల్గాంధీ జాతీయ అధ్యక్షపదవి చేపట్టే అవకాశాలు ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కొనాలంటే ఒక్క రాహుల్గాంధీతోనే సాధ్యమవుతుందని కిందిస్థాయి పార్టీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతంలోకన్నా.. రాహుల్గాంధీలో ఎంతో రాజకీయ పరిణతి కనిపిస్తోంది.. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించగల సత్తా ఆయనలో ఉందని పార్టీశ్రేణులు అంటున్నాయి.