ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనదైన పాలనతో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అధికారులు, ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తాజాగా.. మరో కీలకనిర్ణయం తీసుకున్నారు. అధికారులు, ఉద్యోగుల బదిలీలను ఏకంగా నిషేధించారు. ఐఎఎస్, ఐపిఎస్, పీసీఎస్, పీపీఎస్తో సహా అన్ని స్థాయిల సిబ్బంది బదిలీలపై నిషేధం విధిందింది రాష్ట్ర ప్రభుత్వం. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బదిలీల నిషేధం అమలవుతుందని ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ విరమణ, పదోన్నతి, సస్పెన్షన్, తొలగింపు, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ మొదలైన విషయాల్లో ముఖ్యమంత్రి యోగి అనుమతి తప్పనిసరి.
ఇంతకుముందు యోగి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్తో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు రకాల భత్యాలను రద్దు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆ రాష్ట్రంలోని 16 లక్షల మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. సీఎం యోగి నిర్ణయంపై ఉద్యోగవర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.