కరోనా వైరస్ సహజమైనది కాదనీ, అది మానవ సృష్టేనని, ల్యాబ్ నుంచే పుట్టిందని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పలువురు పరిశోధకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. వీరందరూ చైనానే నిందిస్తున్నారు. తాజాగా.. భారత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా సంచలన కామెంట్స్ చేశారు. కరోనా పుట్టుకకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. వైరస్ ల్యాబ్ నుంచే వచ్చిందని, ఇది సాధారణ వైరస్ కాదని ఆయన అన్నారు. బుధవారం ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
*ఇది సాధారణ వైరస్ కాదు. కృత్రిమమైనది. వ్యాక్సిన్ తయారీ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. వస్తే ఎలాంటి సమస్యా ఉండదు. ఇక మరో సమస్య ఏమిటంటే. వైరస్ను గుర్తించే మెథడాలజీ. వైరస్ను వెంటనే గుర్తించే పద్ధతిని కనుగొనాల్సిన అవసరం ఉన్నది. ఇది ఊహించనిది. ఎందుకంటే ఈ వైరస్ ల్యాబ్లో తయారైనది. మనం కరోనాతోపాటు ఆర్థిక యుద్ధం కూడా చేయాలి. మనది పేదదేశం. నెలా నెలా లాక్డౌన్ను పొడిగించలేం* అని అన్నారు. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలచై చైనా కూడా స్పందించే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.